Parliament Monsoon Session 2021: లోక్‌సభలో ఏపీ జాబ్‌ క్యాలెండర్‌

Andhra Pradesh Job Calendar in Lok Sabha - Sakshi

కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి ప్రస్తావన

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణీత కాలంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతుండటంపై సోమవారం లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రస్తావించారు. 2021–22 సంవత్సరంలో ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్‌ను కూడా విడుదల చేసిందని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి చెప్పారు. ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ, వివిధ ప్రభుత్వ విభాగాల నియామక సంస్థల ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలను అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్స్‌గా ఏర్పాటుచేసి వాటికోసం 1,26,728 పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. 7,966 పోస్టులను ఇంకా భర్తీచేయాల్సి ఉందన్నారు. ఉపాధి, శిక్షణాశాఖ సమన్వయంతో జాబ్‌మేళాలు, జాబ్‌ ఫెయిర్లను నిర్వహిస్తూ ప్రైవేట్‌ రంగంలో నియామకాలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శక, జవాబుదారీ కోసం ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌›డ్‌ సర్వీసెస్‌ (ఆప్కోస్‌)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని బీజేపీ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.  

విశాఖ ఉక్కుపై పునరాలోచన లేదు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాద్‌ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రై వేటీకరణ కాకుండా రెండో అభిప్రాయం ఏమైనా ఉందా అన్న వైఎస్సార్‌సీపీ సభ్యుడు గోరంట్ల మాధ వ్‌ ప్రశ్నకు మంత్రి  సమాధానం ఇచ్చారు. ఎంఎస్‌ ఎంఈల ఉపశమనం నిమిత్తం పలు చర్యలు చేపట్టామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, గొడే ్డటి మాధవి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సర్వీ సు స్టేషన్లకు రాలేని భారీ వాహనాల కోసం మొబైల్‌ డిస్పెన్సర్ల ద్వారా డీజిల్‌ను డోర్‌ టు డోర్‌ డెలివరీ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులశాఖ మంత్రి రామేశ్వర్‌ తేలి చెప్పారు.

భారతీయ భాషల పట్ల వివక్ష లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ఏపీకి జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని గత సెప్టెంబర్‌ 8న ఏపీ సీఎం లేఖ రాశారని, విడుదలకు హామీ ఇచ్చామని వైఎ స్సార్‌సీపీ సభ్యుడు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌ (ఎన్‌జీఎంఏ) ఆడియో విజువల్‌ గైడ్‌ యాప్‌ను మే 18న ప్రారంభించిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు సంజీవ్‌కుమార్, సత్యవతి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మధ్యాహ్న భోజన పథకానికి ఏపీకి రూ.375.10 కోట్లు విడుదల చేశామని, ఏపీలో 92 శాతంమంది విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందారని టీడీపీ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు ప్రశ్నకు  కేంద్ర  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ గతంలోని క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ స్థానంలో ఈ ఏడాది మార్చి 25న స్వయం రెగ్యులేషన్స్‌–2021 ద్వారా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోర్సుల కోసం క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించిందని ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు   ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానమిచ్చారు.

రాజ్యసభలో.. డిజైన్ల మార్పుతో పెరిగిన పోలవరం హెడ్‌వర్క్స్‌ వ్యయం
డిజైన్లలో మార్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ వ్యయం రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. 2014 ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అంచనా వేసి న వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుం దని చెప్పారు.  వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన  సమాధానంలో పేర్కొన్నారు.  విశాఖపట్నంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పా ర్క్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనం జరుగుతున్నట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. విజయవాడలో ఈ పార్క్‌కు ఆశించినంత డిమాండ్‌ లేనట్లు అధ్యయనంలో వెల్లడైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధామిచ్చారు. మల్టీస్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం పోర్టు ట్రస్టును గుర్తించినట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులశాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్‌ తెలిపారు. 

 పోలవరంలో 3 విద్యుత్‌ యూనిట్లు
960 మెగావాట్ల సామర్థ్యంతో సిద్ధంకానున్న పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టులో ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యంతో 12 యూనిట్లు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. వీటిలో 3 యూనిట్లను 2024 జూలై నాటికి, మిగిలిన 9 యూనిట్లను 2026 జనవరి నాటికి పూర్తిచేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.   ఏపీ, తెలంగాణ నుంచి గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదన రాలేదని   టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 

పోలవరంపై చర్చకు నోటీసులు
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉందని, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులు తిరిగి చెల్లించాల్సి ఉందని, ఈ విషయాలపై చర్చ జరపాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే సోమవారం లోక్‌సభ  స్పీకర్‌ ఓం బిర్లా ఈ నోటీసును అనుమతించలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top