కరోనా పరిస్థితుల్లో సమ్మెతో ఇబ్బంది | Andhra Pradesh CS Sameer Sharma exhorts employees | Sakshi
Sakshi News home page

కరోనా పరిస్థితుల్లో సమ్మెతో ఇబ్బంది

Feb 1 2022 3:04 AM | Updated on Feb 1 2022 8:22 AM

Andhra Pradesh CS Sameer Sharma exhorts employees - Sakshi

సాక్షి, అమరావతి: ‘ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ప్రతి ఉద్యోగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రుల నుంచి బయటికి వచ్చే కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోవిడ్‌ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే ఊపం దుకుంటున్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు భంగం కలుగుతుంది. సమ్మె వల్ల రాష్ట్రం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. అర్థం చేసుకోండి’ అని ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్‌శర్మ ఉద్బోధించారు. సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆందోళన విరమించేలా సంఘాలను ఒప్పించాలని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయం నుండి ఆయన ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. మనమంతా ఒక కుటుంబమని ఉద్యోగులకు చెప్పారు. అందరం ప్రభుత్వంలో భాగమని, మెరుగైన సేవల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగులుగా మనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగం ఉందని ఉద్యోగ సంఘాలకు తెలపాలని కలెక్టర్లకు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందనే విషయాన్ని తెలియజేసి అందరూ కలిసి పని చేద్దామని చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ కూడా పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement