ప్రగతికి పది సూత్రాలు | Andhra Governor Syed Abdul Nazeer unfurls National flag on 76th Republic Day | Sakshi
Sakshi News home page

ప్రగతికి పది సూత్రాలు

Jan 27 2025 3:55 AM | Updated on Jan 27 2025 3:56 AM

Andhra Governor Syed Abdul Nazeer unfurls National flag on 76th Republic Day

గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ నజీర్‌ 

పేదరికం లేని సమాజం మా లక్ష్యం 

సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం 

అభివృద్ధి లక్ష్యంగా ‘పీ 4’ విధానం 

ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం 

2026 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి 

కేంద్రం సహకారంతో ఏపీ ముందుకు..

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రగతికి పది సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహించిన 76వ గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళంతో దెబ్బతిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వనరుల మళ్లింపుతో పాటు దుష్పరిపాలన సాగించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై పడిందన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని, నిలిచి­పోయిన ప్రాజెక్టులతో పాలనా వ్యవస్థ దెబ్బ తిన్నద­న్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, ప్రతి సవాలును అవకాశంగా మార్చడం మన బాధ్యతని, ఇందుకు స్వర్ణాంధ్ర విజన్‌ 2047 రోడ్‌మ్యాప్‌ రూపొందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజే­శామన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొదట ఓట్‌–ఆన్‌–అకౌంట్‌ బడ్జెట్‌ను పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక అడ్డంకులను అధిగమించడం, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రూ.16 లక్షల కోట్ల నుంచి 2047 నాటికి రూ.305 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సీఎం చంద్ర­బాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, పలువురు మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీఎస్‌ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

పది సూత్రాలు
పేదరికం నిర్మూలనకు పీ 4 విధానం. 
అందరికీ స్వచ్ఛమైన తాగునీరు.
మహిళ, యువత సాధికా­రతపై ప్రత్యేకంగా దృష్టి.

యువతను రేపటి అవకాశాలకు సిద్ధం చేస్తూ వేగంగా నైపుణ్య గణన
నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులు
2026 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మామిడి, అరటి, మిర్చి, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు లాంటి పంట ఉత్పత్తులు ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం.
మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీమోడల్‌ రవాణా కేంద్రాల అభివృద్ధి.

క్లీన్‌ ఎనర్జీ పాలసీ 2024తో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు. 5వేల ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు. పీఎం సూర్య ఘర్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ పథకం, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి ప్రోత్సాహం.
గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతిలో పండించే పంటలకు విలువ జోడింపు సౌకర్యాల కల్పన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement