
బట్టలు లేకుండా నీటిగుంతలో మృతదేహం
లైంగికదాడి చేసి చంపేశారనే అనుమానాలు
చిత్తూరు జిల్లా: పట్టణ సమీపంలోని ఎక్స్ప్రెస్హైవే పనులు సాగుతున్న ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం.. పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయానికి వెనుకవైపు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటీవల ఆ గుంతల్లో వర్షపునీరు చేరింది. ఓ గుంతలో 30 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీఐ నరసింహరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు. ఆపై మృతదేహాన్ని వెలికితీసి గమనించగా ముఖంపైన, శరీరంపై పలుచోట్ల రక్తగాయాలు కనిపించాయి. ఆ ప్రదేశానికి పైన గుంత ఒడ్డున ముళ్లపొదలపై మృతురాలి పాదరక్షలు, నైటీ, లోదుస్తులు కనిపించాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే పోలికలున్న మహిళ కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో తచ్చాడుతూ ఉండేదని కొందరు చెబుతున్నారు. ఆమెకు మతి బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఘటన జరిగి మూడురోజులైంటుదని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పారు.