గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో ఘటన
బాలురు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, పోలీసులు గాలింపు
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలో ముగ్గురు బాలురు అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వడ్లమూడి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గుండవరం గ్రామానికి చెందిన తుపాకుల గోపి, సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల భరత్, వేజండ్ల గ్రామానికి చెందిన జమీద్ అహ్మద్ శనివారం సాయంత్రం నుంచి కనపడడం లేదు.
ఈ విద్యార్థులు శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత అదృశ్యమైపోయారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవటం, పరిసర ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఓ విద్యార్థి వద్ద ఉన్న సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు ఎక్కడికి వెళ్లారు.
ఏదైనా ప్రమాదం జరిగిందా, ఎవరైనా మాయమాటలు చెప్పి తీసుకువెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల కోసం గాలింపుచేపట్టారు. బాలుడు వద్ద ఉన్న సెల్ఫోన్ సిగ్నల్స్ తెలంగాణలోని పలు ప్రాంతాలు చూపుతుండడంతో వారి ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురు తెనాలి నుంచి రైలులో హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి ఆదివారం ఉదయం వరంగల్కి వెళ్లినట్లు భావిస్తున్నారు. దీనిపై స్థానిక ఎస్ఐ పి వీరనారాయణ, సిబ్బంది ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేపట్టారు.


