ఒక్కరోజే 6,351 కేసుల పరిష్కారం | 262 Cases Settled In E-Lok Adalat | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే 6,351 కేసుల పరిష్కారం

Dec 13 2020 4:25 AM | Updated on Dec 13 2020 8:43 AM

262 Cases Settled In E-Lok Adalat - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాల్లో ఈ–లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్, లీగల్‌ సరీ్వసెస్‌ అథారిటీ చైర్మన్‌ జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఈ–లోక్‌ అదాలత్‌ చేపట్టారు. హైకోర్టులో మూడు బెంచ్‌లు, 13 జిల్లాల్లోని కోర్టుల్లో 322 లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ–లోక్‌ అదాలత్‌లో మొత్తం 6,351 కేసులను పరిష్కరించారు. రూ.33.77 కోట్లను సెటిల్‌మెంట్‌ కింద చెల్లింపులు చేశారు. ఈ–లోక్‌ అదాలత్‌కు సహకరించిన వారందరికీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు కృతజ్ఞతలు తెలిపారు. 

హైకోర్టులో 262 కేసులు పరిష్కారం... 
హైకోర్టులో నిర్వహించిన ఈ–లోక్‌ అదాలత్‌ కేసులను న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ నైనాల జయసూర్య బెంచ్‌లు విచారించాయి. ఈ మూడు బెంచ్‌లు 368 కేసులను విచారించి, అందులో 262 కేసులను పరిష్కరించాయి. రూ.1.01 కోట్లను సెటిల్‌మెంట్‌ కింద నిర్ణయించాయి. హైకోర్టులో లోక్‌ అదాలత్‌ విజయవంతం కావడానికి సహకరించిన వారికి హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement