యోగాంధ్రలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు | 25 thousand AU students to serve as trainers at yoga day event | Sakshi
Sakshi News home page

యోగాంధ్రలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు

Jun 21 2025 4:24 AM | Updated on Jun 21 2025 4:24 AM

25 thousand AU students to serve as trainers at yoga day event

ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం ఎగబడుతున్న విద్యార్థులు

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 25 వేల మంది విద్యార్థులతో యోగాసనాలు 

శుక్రవారం రాత్రి అరకొర భోజనాలు అందజేత 

ఆకలితో అలమటించిన విద్యార్థులు

లంబసింగి నుంచి వచ్చిన చిన్నారులకు వసతి లేక ఇబ్బందులు 

ఏయూ మైదానం, బస్సుల్లోనే నిద్ర పట్టించుకోని కూటమి ప్రజాప్రతినిధులు

విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం విశాఖలో అట్టహాసంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు నిద్రాహారాలకు అలమటించారు. శుక్రవారం రాత్రి భోజనాలు సరిపోక.. ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. వసతి ఏర్పాట్లు లేకపోవడంతో మైదానం, బస్సుల్లో నిద్రపోయారు. ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డుపై పెట్టిన శ్రద్ధ.. చిన్నారులకు భోజనం, వసతి ఏర్పాట్లపై పెట్టలేదు. దీంతో యోగాసనాలు చేయడానికి అల్లూరి జిల్లా నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

భోజనాల కోసం గలాటా.. 
యోగాంధ్ర వేడుకల్లో భాగంగా అల్లూరి జిల్లా నుంచి 25 వేల మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖకు తరలించింది. శుక్రవారం తెల్లవారుజామునే అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో చిన్నారులను ఎక్కించి మధ్యాహ్నం 12 గంటలకు ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌కు తీసుకొచ్చారు. వారికి అక్కడ సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. ప్లేటు తీసుకోవడం నుంచి తిన్నాక చేతులు కడుక్కోవడం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. తాగునీటి కోసం ఎండలో లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన యోగాసనాల కార్యక్రమం ఆలస్యమైంది. సాయంత్రం 4.45కు విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించారు. 

రాత్రి భోజనాలకూ అవే తిప్పలు.. 
బస్సుల్లో నిద్రపోయిన విద్యార్థులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాత్రి 8 గంటల వరకు పిల్లలు గ్రౌండ్‌లోనే ఉండిపోయారు. అనంతరం అక్కడకు భోజనాలు తీసుకురాగా, అవి సరిపోలేదు. సగం మందికి భోజనాలు అందలేదు. దీంతో 30 నిమిషాల పాటు భోజనాల కోసం విద్యార్థులు ఎగబడ్డారు. ఈ సమయంలో గలాటా జరిగింది. కొంత సేపటికి మళ్లీ భోజనాలు తీసుకొచ్చి వారికి అందించారు. అనంతరం వారిలో కొంత మందిని విశాఖ వ్యాలీ, పెందుర్తి ప్రాంతంలోని కళ్యాణ మండపానికి తరలించారు. లంబసింగితో పాటు మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి  వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులు గ్రౌండ్‌లో, బస్సుల్లోనే నిద్రపోవాల్సి వచ్చింది. వీరందరినీ శనివారం వేకువజాము 4 గంటలకే సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించడం గమనార్హం.  

ప్రజాప్రతినిధులు, అధికారుల సేవల్లో జిల్లా యంత్రాంగం.. 
యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు విశాఖకు వచ్చారు. అన్ని శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు 3రోజులు ముందుగానే నగరానికి చేరుకున్నారు. దీంతో జిల్లా అధికారులందరూ వారి సేవలోనే తరిస్తున్నారు. యోగాంధ్ర ఏర్పాట్లు, తరలించిన విద్యార్థుల పరిస్థితులను పట్టించుకునే దిక్కు లేదు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6.30 గంటల నుంచి 7.50 వరకు జరగనుంది.

ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం గంటలకు ముందు సిబ్బంది, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వలంటీర్లకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. యోగాంధ్ర కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్, ఇతర విషయాలను వివరించేందుకు 2 వేల మందికి శుక్రవారం రాత్రి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు, మూడు రోజులకు ముందే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. అధికారులందరూ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సేవలో తరించడంతో ఈ కార్యక్రమంలో జాప్యం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement