అల్లూరి సీతారామరాజు జిల్లా: మండలంలో మత్స్యకారుల పంట పండుతోంది. భారీ చేపలు వలకు చిక్కుతుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డుడుమ జలాశయం, మత్స్యగెడ్డలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయంలో సోమవారం 20 కిలోల చొప్పున నాలుగు చేపలు సింధిగూడ గ్రామ గిరిజనుల వలకు చిక్కాయి. సుజనకోట, దారెల, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు పంచాయతీల్లో మత్స్యగెడ్డ పరీవాహక గ్రామాల గిరిజన మత్స్యకారులు నాటు పడవలపై ముమ్మరంగా చేపల వేట చేస్తున్నారు. వారి వలలకు 15 కిలోల నుంచి 20 కిలోల వరకు బంగారుపాప చేపలు చిక్కుతున్నా యి. వీటిని మండల కేంద్రానికి తీసుకువచ్చిన వెంటనే కొనుగోలుదారులు దక్కించుకోవడానికి పోటీపడ్డారు. కిలో రూ. 300 నుంచి రూ. 350 వరకు విక్రయిస్తున్నారు.


