
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలును వివరించడం.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. కార్యక్రమానికి 19వ రోజైన మంగళవారం అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, సచివాలయాల కన్వినర్లు, వలంటీర్లు, గృహసారథులతో కూడిన బృందానికి ప్రతి ఇంటా ఆ కుటుంబ సభ్యులు ఆచ్చియ స్వాగతం పలుకుతున్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిలో ఏ ఒక్కటీ అమలుచేయకపోవడాన్ని జగనన్న సైన్యం ప్రతి ఇంటా వివరిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలుచేయడాన్ని చాటిచెబుతోంది. జగనన్న సైన్యం చేస్తున్న ప్రచారానికి ప్రతి ఇంటా అపూర్వ స్పందన లభిస్తోంది.
మోసానికి చంద్రబాబు ప్రతీకైతే.. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ప్రతీక అని అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు నినదించారు. గత 46 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా తమ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరిస్తూ.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ప్రతి ఇంటా ప్రజలు కొనియాడారు. ఇక జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో నిర్వహిస్తున్న మెగా పీపుల్స్ సర్వేకు కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
సీఎం వైఎస్ జగన్ పాలనకు మద్దతు తెలుపుతూ సోమవారం నాటికి 84 లక్షల కుటుంబాల ప్రజలు 82960–82960 నెంబర్కు మిస్డ్కాల్స్ ఇచ్చారు. సీఎం జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను గృహసారథులను అడిగి మరీ తీసుకుని.. ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని ప్రజలు అభిమానాన్ని చాటుకుంటున్నారు.