కళ్యాణదుర్గం: పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వారికి పెద్ద పీట వేస్తున్నామని, అలాంటి వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దించి సమష్టిగా గెలిపించుకుందామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గ పరిశీలకుడు మహేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ రైతు, విద్యార్థి, ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు కూటమి పార్టీల నేతల అవినీతి అక్రమాలు, అరాచకాలు పేట్రేగిపోతున్నాయని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని సూచించారు. పంచాయతీలలో అభ్యర్థుల ఎంపిక– వారి గెలుపు బాధ్యతలను స్థానిక నాయకులు, కార్యకర్తలే తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గుర్తింపు కార్డులను అందజేశారు.
అభ్యర్థుల గెలుపే లక్ష్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమాలు, దోపిడీలకు తెగబడుతున్నారన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారన్నారు. ప్రజల పక్షాన నిలిచి, సంక్షేమానికి పాటుపడే వైఎస్సార్సీపీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
సమష్టిగా పనిచేసి గెలిపించుకుందాం
వైఎస్సార్సీపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు


