అనంతపురం: జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈ.భీమారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో రాజీ పడదగ్గ కేసులను నిర్ధారించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
20 రోజులుగా నీరివ్వకుంటే ఎలా బతకాలి?
యాడికి: 20 రోజులుగా నీరివ్వకుంటే ఎలా బతకాలి? అంటూ పిన్నేపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య తీర్చే వరకు ఇలానే కూర్చుంటామని స్పష్టం చేశారు. పిన్నేపల్లి గ్రామస్తుల ఆందోళనతో గుత్తి–తాడిపత్రి మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ గోపాలుడు సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళనకారుతో మాట్లాడారు. ఈఓ గీత మాట్లాడుతూ పిన్నేపల్లిలో ప్రతి ఇంటికీ రెండు రోజుల్లో నీరందేలా చర్యలు తీసుకుంటామని, అంతవరకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని తెలపడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.
ట్రెల్లీస్ స్కూల్పై విచారణ
● ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురంలోని ట్రెల్లీస్ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన అభియోగాలపై జిల్లా విద్యాశాఖ స్పందించింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారి అయ్యూబ్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించనుంది.బాలిక తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది వైఖరి తదితర అంశాలపై విచారణ చేపట్టి సమగ్ర నివేదికను విద్యాశాఖకు అందజేయనుంది. ప్రత్యేక కమిటీ అందించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు.


