కణేకల్లు: జాతీయస్థాయి సైన్స్ఫెయిర్ పోటీలకు మండలంలోని హనకనహళ్ జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని పూజారి మానస తయారు చేసిన ‘సోలార్ స్కేర్క్రో (సౌర దిష్టిబొమ్మ)’ ప్రాజెక్ట్ ఎంపికై ంది. ఫిజికల్ సైన్స్ టీచర్ చంద్రమునయ్య సమక్షంలో మానస ఈ ప్రాజెక్ట్ను తయారు చేసింది. ఇటీవల ఆన్లైన్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాజెక్ట్ గురించి వివరించడంతో సైన్స్ఫెయిర్ అథారిటీ వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 11, 12, 13వ తేదీల్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ప్రాజెక్ట్ను ప్రదర్శించనున్నట్లు హెచ్ఎం వేణుగోపాల్, సైన్స్ టీచర్ తెలిపారు.
ఎలా పని చేస్తుందంటే?
రైతులు తాము సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, దిష్టిబొమ్మలు పెట్టడం, డబ్బాలో గులక రాళ్లు వేసి అల్లాడించడం వంటివి చేస్తుంటారు. విద్యుత్ తీగలు, ముళ్ల కంచెలతో పక్షులు, జంతువులకు ముప్పు వాటిల్లుతుంది. మానస తయారు చేసిన ప్రాజెక్టుతో అలాంటివేవీ ఉండవు. సోలార్తో పని చేసే ఈ స్కేర్క్రో ముందుభాగంలో అమర్చిన అల్ట్రాసోనిక్ సెన్సార్ నిరంతరం శబ్ద తరంగాలను వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఏదైనా పక్షి లేదా జంతువు పొలంలోకి రాగానే తరంగాలు జంతువును తాకి ఆ సంకేతాలు పరికరానికి అందుతాయి. ఈ క్రమంలో మోటార్లు తిరిగి దిష్టిబొమ్మ చేతులు వేగంగా పైకి, కిందికి కదిలి శబ్దం రావడంతో జంతువులు, పక్షులు భయపడి పారిపోతాయి. ఇది పూర్తిగా ఆటోమేటిక్ (స్వయంచాలక) వ్యవస్థ కావడంతో రైతుల శ్రమ, సమయం ఆదా అవుతాయి. పర్యావరణానికీ హాని కలగదు.


