అనంతపురం న్యూ టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజక వర్గాల ప్రజల దాహార్తి తీర్చే నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పథకం అమలు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికుల జానెడు పొట్టకు పిడికెడు అన్నం కరువైంది. ప్రతిసారి ఆందోళనలు చేస్తే తప్ప వేతనాలు అదే పరిస్థితి లేదు. వారికి చెల్లించాల్సిన జీతభత్యాల చెక్కులు యథావిధిగా జారీ అవుతున్నాయి. రాష్ట్రస్థాయి ‘ముఖ్య’ నేత అండదండలు ఉన్నాయన్న ఒకే ఒక నెపంతో కార్మికుల జీతాల నిధులను కొల్లగొడుతున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టు నిర్వహణకు ‘ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్’ అనే సంస్థతో జిల్లా పరిషత్ సీఈఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు కాంట్రాక్ట్ కొనసాగింది.
ఏమిటీ చెక్కుల మాయ..!?
శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టులో పనిచేసే కార్మికుల వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇటీవల నిధులను విడుదల చేసింది. గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం అధికారులు కాంట్రాక్టు సంస్థకు కార్మికుల వేతనాల సొమ్మును చెక్కుల రూపంలో జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్’ సంస్థ పేరుతో ఎం బుక్కులు తయారు చేశారు. అందులో పొందుపరిచిన వివరాల మేరకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ పేరుతో రూ.43,09,199కు చెక్కు (303306 నంబర్)ను ఆగస్టు 19న జారీ చేశారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎవరి నుంచి.. ఎందుకు.. ఎలాంటి ఆదేశాలు వచ్చాయో ఏమో కానీ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు ఆగమేఘాల మీద స్పందించారు. గత నెల 19న ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ పేరుతో జారీ అయిన చెక్కును వెనక్కు తెప్పించారు. ఆ తర్వాత వెంటనే చెక్కును రద్దుపరచి మరో వారం రోజుల వ్యవధిలో అంటే ఆగస్టు 25న చెక్కు(303308 నంబర్)ను అడప వెంకటరావు పేరుతో జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చెక్కు ఎందుకు రద్దు పరిచారు.. అనధికారిక వ్యక్తి పేరిట చెక్కు ఎందుకు ఇచ్చారు అన్నది అనుమానాలకు తావిస్తోంది.
బినామీ కాంట్రాక్టర్ పేరుతో చెక్కు జారీ
‘ముఖ్య’ నేత సిఫార్సుతో ఫలహారం..
చక్రం తిప్పిన ఆర్డబ్ల్యూఎస్ అధికారి
కాంట్రాక్ట్ ఒకరితో.. చెక్కు మరొకరి పేరుతో
శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో భారీ కుంభకోణం


