అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు తెలియజేయాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అధికారులకు అందజేయాలన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలిపారు.
జిమ్ చేస్తూ కుప్పకూలిన ఎల్ఐసీ అధికారి
కదిరి టౌన్: పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న లోటస్ జిమ్లో వ్యాయామం చేస్తున్న ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ షాజహాన్ (36) శనివారం రాత్రి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లా వండ్లపల్లికి చెందిన షాజహాన్ కదిరిలో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి షాజహాన్ లోటస్ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో వెంటనే జిమ్ నిర్వాహకులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెంది నట్లు వైద్యులు తెలిపారు. ఇంటి పెద్ద దిక్కు మృతి చెందడంతో భార్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాజహాన్ భౌతికకాయం వద్ద తోటి ఎల్ఐసీ అధికారులు, ఉద్యోగులు నివాళులర్పించారు.
వైఎస్సార్టీఏ నేతలపై
సస్పెన్షన్ ఎత్తేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్సార్టీఏ) నాయకులను సస్పెండ్ చేయడాన్ని ఆ సంఘం అనంతపురం జిల్లా శాఖ ఖండించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి. శ్రీధర్గౌడ్, గౌరవాధ్యక్షుడు గోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవిందరెడ్డి, వెంకట రమణ, రాధాకృష్ణారెడ్డి ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, భవిష్యత్తుకు సంబంధించిన సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తప్పుకాదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రాతినిధ్యం చేయడం వారి హక్కులో భాగమన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన నాయకులపై సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. వైఎస్సార్టీఏ నాయకులు ఢిల్లీకి వెళ్లింది డీఎస్సీ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కాదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సస్పెన్షన్ను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు.


