అనంతపురం సెంట్రల్: నగరంలోని బైరవ నగర్ 7వ క్రాస్ సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం పాలయ్యాడు.
పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లికి చెందిన రామాంజనేయులు (57) ఇటుక పెళ్లల పరిశ్రమలో కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బైరవనగర్లో పెళ్లలు దించేందుకు టీవీ టవర్ వద్ద ఉన్న ఫ్యాక్టరీ నుంచి ట్రాక్టర్లో బయలుదేరాడు. 7వ క్రాస్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ పక్కన కూర్చొన్న అతను కుదుపులకు అదుపు కిందపడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
లారీ ఢీకొని దంపతులకు గాయాలు
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారున 67వ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో దంపతులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపేట గ్రామానికి చెందిన నరసింహులు, సాలమ్మ దంపతులు వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో గుత్తికి వచ్చారు. పని ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు కొత్తపేట బైపాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడి గాయపడిన సాలమ్మ, నరసింహులును స్థానికులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న సాలమ్మను అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


