● గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్
అనంతపురం అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే దాకా పోరాటం కొనసాగిస్తామని గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్ స్పష్టం చేశారు. గ్రామ సర్వేయర్లు శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఆవరణలోని సర్వే భూ రికార్డుల ఏడీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగలందరికీ ఒకే తరహా బేసిక్ పే ఉండాలన్నారు. అలా కాకుండా గ్రామ సర్వేయర్లకు తక్కువ స్కేల్ ఇవ్వడం అన్యాయం చేయడమేనన్నారు. గ్రామ సర్వేయర్లకు రూ.30 వేలు బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేతప్ప బేసిక్ పే స్కేల్ పెంచకుండా హోదా మార్పు చేస్తే ఆర్థికంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. అలాంటి హోదా తమకు ఎందుకంటూ ప్రశ్నించారు. గ్రామ సర్వేయర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. రీ–సర్వే అలవెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఫ్రిబవరి ఆఖరుకు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్నారు. అందులో భాగంగా ఈ నెల 9న ‘చలో విజయవాడ’ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సర్వే భూరికార్డుల శాఖ ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయసారథికి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్, ఉపాధ్యక్షుడు నాజర్, పెద్ద సంఖ్యలో గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.


