
బలవంతంగా ‘కాంప్లెక్స్’ అంటగడితే కఠిన చర్యలు
పుట్లూరు: యూరియా కోసం వచ్చే రైతులను కాంప్లెక్స్ ఎరువులనూ తీసుకోమని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ ఏజెన్సీల నిర్వాహకులను కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు.శనివారం ఆయన మండలంలోని కడవకల్లు గ్రామంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సక్రమంగా రైతులకు అందేలా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. 50 శాతం యూరియా ప్రభుత్వ గోదాముల ద్వారా, 50 శాతం ప్రైవేట్ ఏజెన్సీలు పంపిణీ చేస్తాయన్నారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులూ తీసుకోవాలంటూ డబ్బు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. రైతులు ఏవి అడుగుతారో అవి మాత్రమే ఇవ్వాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పరిశుభ్రత పాటించాలని గ్రామస్తులకు ఆయన సూచించారు. అనంతరం గ్రామంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ ర్యాలీలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులకు సన్మానించారు. ఉపాధిహామీ పథకం కింద మంజూరైన వ్యక్తిగత సోక్పిట్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడామైదానం కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామాంజినేయులు, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ రామ సుబ్బయ్య, డ్వామా పీడీ సలీమ్బాషా, తహసీల్దార్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ హిత విగ్రహాలనే వినియోగించాలి
● జేసీ శివ్నారాయణ్ శర్మ పిలుపు
అనంతపురం: పర్యావరణ హిత విగ్రహాలను వినియోగించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ పెద్ద విగ్రహాల మంటపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లన్నారు. ఆధ్యాత్మిక భావం పెంపొందేలా భక్తి పాటలు మాత్రమే వినిపించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికరమైన రంగుల వినియోగంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి హెచ్చెల్సీకి నీరు వదలాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వి. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
‘ఆంధ్రకేసరి’ అడుగుజాడల్లో నడుద్దాం
అనంతపురం: స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అడుగుజాడల్లో నడవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ మినీ హాలులో టంగటూరి ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రకాశం పంతులు చూపిన తెగువ, ధైర్యం నిరుపమానమన్నారు.

బలవంతంగా ‘కాంప్లెక్స్’ అంటగడితే కఠిన చర్యలు