
తప్పులకు ఎంఈఓలు, హెచ్ఎంలదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 117 జీఓకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరగాలని, ఏ చిన్న తప్పు జరిగినా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులదే పూర్తి బాధ్యత అని అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎం.ప్రసాద్బాబు, క్రిష్టప్ప హెచ్చరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. తుదిదశకు చేరుకోవడంతో ఎలాంటి తప్పులూ ఉండకూడదనే ఉద్దేశంతో శుక్రవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు హాజరయ్యారు. 15 రోజుల నుంచి సాగుతున్న ఎక్సర్సైజ్లో భాగంగా చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, డీఎస్పీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సమయం దగ్గర పడడంతో స్కూళ్ల వారీగా ఎన్ని పోస్టులున్నాయి... ఎన్ని ఖాళీలున్నాయనేది పక్కాగా తేల్చాల్సి ఉందని డీఈఓలు స్పష్టం చేశారు. హెచ్ఎంలు, ఎంఈఓలు ప్రతిపాదించిన స్కూళ్ల వివరాలు, నిబంధనల ప్రకారం జరిగాయా లేదా? అని పరిశీలించారు. గుర్తించిన తప్పిదాలను సవరించారు.
అన్నమూ లేదు.. తాగునీళ్లూ లేవు
విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లకు కనీసం భోజన వసతి కల్పించలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశంలో పాల్గొన్నారు. అసలే ఎండవేడిమి దంచేస్తోంది. మధ్యాహ్నం వరకు కనీసం తాగేనీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదు. సమావేశానికి హాజరైన వారు తరచూ నీళ్ల కోసమని బయటకు వెళ్లడం కనిపించింది. మధ్యాహ్నం పైన చల్లని తాగునీరు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉన్నా...మధ్యాహ్నం భోజనం విషయం గురించి పట్టించుకోలేదు.
నిబంధనల మేరకే పునర్వ్యవస్థీకరణ
ఉమ్మడి జిల్లా డీఈఓల ఆదేశం