అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్) ఇంటర్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్) శుక్రవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో క్యాంపు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు క్యాంపు కొనసాగుతుందని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ తెలిపారు.
ఎగ్జామినర్ల నియామకాల్లో
నిబంధనలకు పాతర
మూల్యాంకనంలో ఎగ్జామినర్లే కీలకం. అలాంటి వీరి నియామకాల్లో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు పాతరేశారు.తప్పనిసరిగా ఆయా సబ్జెక్టుల్లో కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉన్నవారిని ఎగ్జామినర్లుగా నియమించాల్సి ఉంది. అయితే అనుభవం లేనివారిని, సబ్జెక్టుతో సంబంధం లేకపోయినా తమకు అనుకూలమైన వారిని నియమించారని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ముఖ్యంగా కామర్స్ సబ్జెక్టుకు కొందరు స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఇంగ్లిష్ టీచర్లను నియమించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ విద్యార్హత ఉన్నవారిని తీసుకున్నామని అధికారులు చెబుతున్నా... హిందీ, ఇంగ్లిష్ టీచర్లు వారి సబ్జెక్టుల్లో కాకుండా కామర్స్లో మూడేళ్లు ఎక్కడ బోధించారనేది చెప్పాల్సి ఉంది. ఈ విషయంపై గోవిందనాయక్ మాట్లాడుతూ స్పాట్ ప్రారంభ సమయంలో మరోమారు పరిశీలించి ఎక్కడైనా అలా జరిగి ఉంటే వారిని తొలగించనున్నట్లు తెలిపారు.