అరాచకాలకు ‘కాలవ’ ఆజ్యం
● వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజం
రాయదుర్గంటౌన్: వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అరాచకాలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆజ్యం పోస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బొమ్మనహాళ్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ మూకల దాడితోపాటు తనపై కూడా దాడికి దిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేందుకు చేతకాక దాడులు, బెదిరింపులతో గెలవాలనుకోవడం అధికార దుర్వినియోగంతోపాటు అరాచకత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. కాలవ అండదండలతోనే రెడ్బుక్ రాజ్యాంగం ముసుగులో బొమ్మనహాళ్లో టీడీపీ నాయకులు ముల్లంగి నారాయణస్వామి, ముల్లంగి భాస్కర్, రవి, మల్లికార్జున, తిమ్మరాజు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థి బీఫాంతో పాటు అనెగ్జర్ ఫారం 1, 2 సమర్పించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లామన్నారు. ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించి బయటకు రాగానే అక్కడికి వచ్చిన టీడీపీ మూకలు తమ నాయకులపై దాడి చేసి, తనపై కూడా దాడికి దిగి దుర్భాషలాడాయన్నారు. ఘటన తర్వాత టీడీపీ నాయకులు తిమ్మరాజు, మల్లికార్జునలు వైఎస్సార్సీపీ నాయకులకు ఫోన్ చేసి బెదిరించారన్నారు. ఈ ఘటనపై ఫొటోలు, వీడియోలు తీసిన ‘సాక్షి’ విలేకరి నుంచి ఫోన్ సైతం లాక్కొని పగులగొట్టేందుకు ప్రయత్నించి, చివరకు డేటాను డిలీట్ చేశారన్నారు. ఈ ఘటనపై ఆదివారం పార్టీ శ్రేణులు, జిల్లా అధ్యక్షుడితో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు బ్రహ్మానందరెడ్డి, రామాంజనేయులు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, జిల్లా ఉపాధ్యక్షుడు మారెన్న, సీనియర్ నాయకులు జయరామిరెడ్డి, కేశవరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, హళ్లి నాగరాజు, మండల కోఆప్షన్ సభ్యుడు దిలావర్బాషా తదితరులు పాల్గొన్నారు.


