
మాట్లాడుతున్న పైలా నరసింహయ్య
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా ధ్వజం
తాడిపత్రి టౌన్: అధికారం లేకపోవడంతో జేసీ ప్రభాకర్రెడ్డి ఓ ఉన్మాదిలా మారాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మండిపడ్డారు. తాడిపత్రి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అధికారులపై అసత్య ఆరోపణలతో మతిలేని రాజకీయాలు చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు అంబాసిడర్గా మారాడని ధ్వజమెత్తారు. ఆదివారం తాడిపత్రిలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ స్టేషన్లకు తాళాలు వేసి, పోలీసులను దుర్భాషలాడిన నీచ చరిత్ర జేసీ ప్రభాకర్రెడ్డిదన్నారు. తన మాట వినలేదన్న అక్కసుతో పోలీసు అధికారులపై అక్రమంగా కేసులు పెట్టించి పబ్బం గడుపుకున్నారన్నారు. అధికారం లేకపోవడంతో తాడిపత్రికి పోలీస్ అధికారులెవ్వరూ రావద్దు..స్వేచ్చగా పనిచేసే వీలులేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రి ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తమ విధులను నిజాయితీతో స్వేచ్ఛగా నిర్వర్తిస్తున్నారన్నారు. తాడిపత్రిలో సీఐ హమీద్ఖాన్ పనితీరు బాగుందని, అయితే కొన్ని అంశాల్లో నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో శాఖాపరమైన చర్యలను అధికారులు తీసుకున్నారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తాడిపత్రి ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు.
వేధింపుల కేసు నమోదు
వజ్రకరూరు: అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ వజ్రకరూరు మండలం కమలపాడు తండాకు చెందిన మూడ్ గౌతమి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు వజ్రకరూరు పోలీసులు తెలిపారు. వివరాలు.. సీఆర్పీఎప్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కమలపాడు తండాకు చెందిన దుర్గాప్రసాద్ నాయక్తో 2015లో గౌతమికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం భర్త దుర్గాప్రసాద్ నాయక్, అత్త పద్మావతి వేధిస్తుండడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.