కళ్యాణదుర్గం రూరల్: రైతును రాజుగా చూడాలనేదే జగనన్న లక్ష్యమని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ అన్నారు. గరుడాపురం పంచాయతీలో కృషి విజ్ఞాన కేంద్రం సమీపాన రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్సీ మంగమ్మతో కలిసి మంత్రి ఉషశ్రీచరణ్ మంగళవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ సేవలను రైతు ముంగిటకు తీసుకొచ్చిందన్నారు. అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు అవసరమైన చోట్ల సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ బాటలోనే సీఎం జగనన్న కూడా పయనిస్తూ మన్ననలు పొందుతున్నారన్నారు. టీడీపీ పాలనలో రైతులను పూర్తిగా విస్మరించారన్నారు. కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను జైలుకు పంపిన చరిత్ర టీడీపీదని విమర్శించారు. ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని ఇప్పటికే నిరూపితమైందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి, జెడ్పీటీసీ బొమ్మన్న, ఎంపీపీ మారుతమ్మ, వైస్ ఎంపీపీ లక్ష్మీ కాంతమ్మ, విద్యుత్ ఈఈ శేషాద్రి శేఖర్, డీఈఈ గురురాజ్, ఏఈ సలీమ్, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు, మండల కన్వీనర్ సర్వోత్తం, పట్టణ జేసీఎస్ కన్వీనర్ అర్చన, మండల జేసీఎస్ కన్వీనర్ ఆంజనేయులు, మండల మాజీ కన్వీనర్ తిరుమల వెంకటేశులు, నాయకులు సుధీర్, ముదిగల్లు నరేంద్రరెడ్డి, హనుమంతురాయుడు పాల్గొన్నారు.
నేడు తాడిపత్రిలో
‘జగనన్నకు చెబుదాం’
అనంతపురం అర్బన్: ‘జగనన్నకు చెబుదాం’ మండలస్థాయి కార్యక్రమాన్ని బుధవారం తాడిపత్రిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9.30 గంటలకు ‘జగనన్నకు చెబుదాం’, ‘స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.