కశింకోట: మండలంలోని జి.భీమవరం గ్రామానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీ పురస్కారం లభించింది. జాతీయ స్థాయి ఉత్తమ పంచాయతీ పురస్కారానికి రాష్ట్రం నుంచి నామినేట్ అయిన 9 పంచాయతీలకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీ పురస్కారం అందజేశారు. వీటిలో ఒకటైన జి.భీమవరం పంచాయతీకి కూడా ఈ పురస్కారం లభించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్వో) సర్టిఫికెట్ను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శి ఆర్.నారాయణరావు విజయవాడలో గురువారం స్వీకరించారు. పంచాయతీలో అత్యుత్తమ ఆన్లైన్ సేవలు అందించడంతో పాటు, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వ ప్రతిష్టాత్మక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుంచే సేవలు పొందే వెసులుబాటు కల్పించారు. ఈ అవార్డు పొందడానికి అనుసరించిన ప్రమాణాలను ఇలాగే కొనసాగిస్తూ, జాతీయ పురస్కారం పొందడంలో కూడా రాష్ట్రాన్ని ముందుంచేలా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా రాష్ట్ర కమిషనర్ కృష్ణ తేజ అధికారులకు సూచించారు. అదనపు డైరెక్టర్ మల్లేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి ఈ.సందీప్, ఎంపీడీవో సీహెచ్. చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో ఎం.వెంకటలక్ష్మి, జి. భీమవరం పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది ఈ పురస్కారం పొందడంలో ముఖ్య భూమిక పోషించారు.


