అనకాపల్లి: ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే నడపాలని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.రమణారెడ్డి అన్నారు. స్థానిక వైఎంవీఏ హాల్లో శుక్రవారం జరిగిన విశాఖ ఉమ్మడి జిల్లా కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహించడం వల్ల రాబోయే రోజుల్లో ఆర్టీసీ నిర్వీర్యమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అన్నివర్గాల ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజారవాణా శాఖను కాపాడుకోవలసిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులందరిపై ఉందన్నారు. సీ్త్ర శక్తి పథకం వల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారని, జీరో టికెట్ విధానం తీసివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. సీ్త్రశక్తి పథకానికి తగ్గట్టుగా కొత్త ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు మెరుగైన సేవలందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని రూట్లలో ఓటీల పేరుతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రానున్న సీసీఎస్ ఎన్నికలకు కమిటీలన్నీ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.ఎం.నాయుడు, రాష్ట్ర కోశాధికారి పి.వి.మోహన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు, రాష్ట్ర కార్యదర్శులు వి.అప్పారావు, సత్యవతి, సురేష్ నాయుడు, పి.జి.పతి, మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎ.కె.శివాజీ, పి.ఎన్.మూర్తి, పీలా సుధాకర్, ఆర్.ఎన్.రాజు, రమణ, నారాయణ, జోనల్ చైర్మన్ ఎం.సూర్యం, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు బి.ఎస్.రాములు, వి.ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


