దేవరాపల్లి : దేవరాపల్లిలోని తమ బంధువుల పెళ్లి వేడుకులకు వచ్చిన విశాఖపట్నం తాటిచెట్లపాలేనికి చెందిన పొన్నాడ లక్ష్మణరావు (61) అదృశ్యమయ్యాడని అతని బంధువులు స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం దేవరాపల్లిలో ఈ నెల 16న జరిగిన పెళ్లికి లక్ష్మణరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. మధ్యాహ్నం వరకు అందరితో ఉన్న అతడు సాయంత్రానికి కనిపించలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం అతని బంధువులు పలు ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా కనిపించలేదు. వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 9010622874, 9573268376కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. కాగా లక్ష్మణరావు చిన్న కుమారుడుకి వచ్చే నెలలో వివాహం నిశ్చయం కావడంతో అతని బంధువులు ఆందోళన చెందుతున్నారు.


