నాతవరం: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో పలువురు ఏకరువు పెట్టారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సరుగుడు, అసనగిరి పంచాయతీల పరిధిలో 16 శివారు గ్రామాలున్నాయని, సెల్ టవర్లు లేక సెల్ సిగ్నల్స్ రావడం లేదని, దీంతో సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 589 మందికి హక్కు పత్రాలు ఇచ్చారని, మిగిలిన వారికి మంజూరు చేయాలని కోరారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ గిరిజనులకు అందడం లేదని చెప్పారు. గిరిజన ఉద్యోగుల సంఘం నర్సీపట్నం డివిజన్ అధ్యక్షుడు జనార్ధన్ మాట్లాడుతూ నర్సీపట్నంలో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో 1/70 యాక్టు పరిధిలో ఉన్న మండలాల్లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణం తెలిపారు. రావికమతం మండలం కల్యాణపులోవ రిజర్వాయర్ ప్రాంతాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


