ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శంఖబ్రత బాగ్చి
సింహాచలం: వచ్చేనెల 20న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అధికారులకు సూచించారు. గురువారం సింహగిరిపై జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. రద్దీ నియంత్రణ కోసం కీలక ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని తెలిపారు. క్యూల్లో తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. భద్రత దృష్ట్యా అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఘాట్ రోడ్డు నుంచి కొండపై, పార్కింగ్ ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పోలీస్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


