నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన మహిళా మార్టుల
మహిళా మార్ట్...
ఏదీ సపోర్ట్!
సాక్షి, అనకాపల్లి : మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా మార్ట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. దాదాపుగా రూ.40 లక్షలతో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను అందజేసింది. జిల్లాలో మాడుగుల, మాకవరపుపాలెం, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, అడ్డురోడ్డులో కార్పొరేట్ తరహా పెద్ద పెద్ద మాల్స్ని తలదన్నేలా ..వాటికంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు మహిళా మార్ట్ల ద్వారా అందించింది. ఈ మార్ట్లో సభ్యత్వం పొందిన పొదుపు గ్రూపు సభ్యులకు డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించింది. అయితే ప్రభుతం మారాక మహిళా మార్ట్లకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. మహిళా మార్టుల్లో మండుతున్న నిత్యవసర సరుకులు ధరలతో విక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.మహిళా మార్ట్ల్లో సరుకులు కొంటే ఒక సమస్య.. కొనకపోతే మరో సమస్య అన్నట్టుగా డ్వాక్రా సంఘాల సభ్యులు పరిస్థితి తయారైంది. ఈ మార్టుల్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా ఉండడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులే వెనుకంజ వేస్తున్నారు. దీంతో వారికి ఈ మార్టుల్లో కొనుగోలు చేస్తేనే బ్యాంక్ రుణాలు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.
ఖర్చులు అధికం...సబ్సిడీ శూన్యం
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పొదుపు సంఘాల భాగస్వామ్యంతో అడ్డురోడ్డులో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ రెండు నెలల క్రితమే మూత పడింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడం, సరుకుల సబ్సిడీ అందించకపోవడంతో మూతపడుతున్నాయి. అధిక నిర్వహణ ఖర్చులు, తక్కువ అమ్మకాలు, అధిక రేట్లు, సరైన నిర్వహణ లేకపోవడం, ప్రభుత్వ నిధుల పక్కదారి పట్టడం, మహిళా సంఘాలు, వెలుగు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, మార్ట్లో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది.
ఒక్కో సభ్యురాలు రూ.3 వేల సరుకులు
కొనాల్సిందే..
డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి సుమారు రూ.40 లక్షలతో మహిళా మార్ట్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళా సభ్యురాలు నెలకు రూ.250 సరకులు కోనుగోలు చేసేవారు. బయట మార్కెట్ కంటే మహిళా మార్ట్లో తక్కువ ధరలకే ఇవ్వడంతో ఒక్కో మహిళ సుమారుగా రూ.మూడు వేల సరకులు కొనేవారు. ప్రభుత్వం మారాక మహిళా మార్టులకు ప్రోత్సాహం కరువైంది. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో మార్టులు నష్టాల బాట పట్టాయి. మహిళా మార్ట్ల్లో సరుకులు ధరలు బాగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. దీంతో అధికారులు, వెలుగు సిబ్బంది ఒక్కో డ్వాక్రా సభ్యురాలు కనీసం రూ.3000 సరుకులు కోనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు అయిష్టంగానే పొదుపు నుంచి గ్రూపునకు రూ.30 వేలు నిత్యవసర సరుకులు కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారుల పట్ల డ్వాక్రా మహిళలు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
ప్రోత్సాహం లేక నష్టాల బాట
అడ్డురోడ్డులో గల మహిళా మార్ట్ను కొనసాగించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేశాం. మహిళా మార్టుల్లో మార్కెట్ రేట్లకే విక్రయాలు చేశాం. డ్వాక్రా మహిళలకు ప్రయోజనం చేయాలనే వీటిని ఏర్పాటు చేసినా..సరైన ప్రోత్సాహం లేక నష్టాల బాటపట్టాయి. కొన్నిసార్లు ఎంఆర్పీ కన్నా తక్కువగా అమ్మేందుకు మార్కెట్లో జీఎస్టీ లేని బిల్లులతో విక్రయాలు చేశాం. మహిళా మార్ట్ ఏర్పాటుకు, సరుకుల కొనుగోలుకు పెట్టుబడి డబ్బులను ప్రభుత్వానికి జమ చేశాం. ఏ ఒక్క రూపాయి కూడా పక్కదోవ పట్టలేదు. ప్రతి రూపాయిని ప్రభుత్వానికి అప్పగిస్తాం.
–శివప్రసాద్, ఏపీఎం, ఎస్.రాయవరం
మహిళా మార్ట్(ఫైల్)
జిల్లాలో ఉన్న ఐదింట్లో ఒకటి మూత
నష్టాల బాటలో మిగిలిన మార్ట్లు
తగ్గిన విక్రయాలు..డ్వాక్రా మహిళలతో బలవంతంగా కొనుగోళ్లు
ఒక్కో గ్రూప్ నుంచి రూ.30 వేల వరకు కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి
లేదంటే బ్యాంకు రుణాలు ఇవ్వమంటూ బెదిరింపులు
నాణ్యత లేని వస్తువులు.. అధిక ధరలు
జిల్లాలో 39,671 స్వయం సహాయక సంఘాలు
జిల్లాలో వివరాలు ఇలా..
జిల్లాలో 1,279 గ్రామ సంఘాలు
39,671 స్వయం సహాయక సంఘాలు
4,34,320 స్వయం సహాయక సభ్యులు


