బలవంత భూసేకరణ రైతుల పాలిట శాపం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణమూర్తి
అనకాపల్లి టౌన్: పరిశ్రమల పేరుతో బలవంత భూసేకరణ రైతులకు భూమి మీదే నరకం చూపిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. స్ధానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా మంగళవారం ‘జిల్లాలో పరిశ్రమల పేరుతో బలవంత భూసేకరణ’ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిశ్రమల పేరుతో సేకరించిన భూములు పూర్తి వినియోగంలో లేవన్నారు. పోరాడి సాఽధించుకున్న విశాఖపట్నం స్టీల్ప్లాంట్కు స్వంత గనులు కేటాయించమని కోరలేని మన రాష్ట్ర ఎంపీలు మిట్టల్ స్టీల్ప్లాంట్కు స్వంత గనులు కేటాయించమని కోరడం సిగ్గుచేటన్నారు. సీపీఐ 100 సంవత్సరాల కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాలు నేడు పథకాలుగా మారాయన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రస్తుతం కోరలు తీసిన పాములాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శ్రీరామచంద్రయ్య మాట్లాడుతూ నక్కపల్లి మండలంలో నిర్మిస్తున్నవి అత్యంత ఎక్కువ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట భూములు, తర్వాత ఖనిజాలు, ఆ తర్వాత ప్రభుత్వ సంస్ధలను పీపీపీ పేరుతో కార్పొరేట్లకు ధారాదత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు. అమరావతికి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల్లో 71 శాతం మందికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. 29 గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పి భూములు సేకరించి అవేమీ ఇప్పటి వరకూ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.విమల, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
బలవంత భూసేకరణ రైతుల పాలిట శాపం


