
అడ్డంగా బుకై ్కన మేయర్
విరుచుకుపడ్డ కూటమి కార్పొరేటర్లు
కౌన్సిల్లో కోళ్ల వ్యర్థాలపై రగడ..
అధికారపార్టీ కార్పొరేటర్ల్ల నిలదీత
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల గళం..
సభ జరిగిన తీరిది..
ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అజెండాలో 84 అంశాలు, టేబుల్ అజెండాలో 67 అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం 151 అంశాల్లో కేవలం రెండు అంశాలు మాత్రమే వాయిదా పడ్డాయి. ఒక్కో అంశానికి 5 నిమిషాలు చర్చించినా, సుమారు 750 నిమిషాలు (దాదాపు 12–13 గంటలు) పడుతుంది. కానీ అలా జరగకుండా తూతూ మంత్రంగా నిర్వహించి 149 అంశాలను ఆమోదించారు.
డాబాగార్డెన్స్(విశాఖ) : కోళ్ల వ్యర్థాల తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించిన తనపైనే ఆరోపణలు చేయిస్తున్నారని స్వయంగా టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీను ఆరోపించారు. జీవీఎంసీలో ఒక అధికారి కిశోర్ ఏళ్లుగా తిష్టవేసి కూర్చున్నారని, ఆయన తీరు బాగోలేదని ఎండగట్టారు. మేయర్ అవినీతిపై సొంత పార్టీ కార్పొరేటర్ నుంచే విమర్శలు రావడంతో మేయర్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో చేసేదేమీ లేక చర్యలు తీసుకుంటానని బెదిరించే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీసింది.
కోళ్ల వ్యర్థాల దందా కూటమి నేతలదే!
(సాక్షి ఇటీవలే ఈ కథనాన్ని ప్రచురించింది)
జీవీఎంసీ పరిధిలో కోళ్ల వ్యర్థాలను సేకరించి కాపులుప్పాడకు తరలించాలి. ఇందుకోసం 8 జోన్లకు ఒక్కొక్కరి చొప్పున మొత్తం 8 మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అయితే కూటమి కి చెందిన కొందరు నేతలు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని కోళ్ల వ్యర్థాలను సేకరించి చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారు. ఈ విషయంపై ఫొటోలతో సహా కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినా, అధికారులు ఆ వాహనాలను పట్టుకుని మళ్లీ వదిలేయడం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారంలో కీలకమైన కూటమి ఎమ్మెల్యేలతో పాటు, తెర వెనుక ఉండి రౌడీషీటర్ల ద్వారా వ్యవహారం నడిపిస్తున్న జీవీఎంసీలోని కీలక నేత తీరుపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ దందాకు జీవీఎంసీలో ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఒక అధికారి తీరుపైనా కౌన్సిల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కోళ్ల వ్యర్థాల దందాపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తుండటంతో, మేయర్ తన పదవి గౌరవాన్ని కూడా విస్మరించి ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో విచారణ జరపకుండా ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను బెదిరించడంతో మేయర్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చర్చ జరపాలని పట్టుబట్టారు.
సొంత పార్టీలోనే విపక్షం : కోళ్ల వ్యర్థాల అక్రమ తరలింపుపై శుక్రవారం జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తరలింపులో రౌడీషీటర్ల్ల ప్రమేయం ఉందని టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆరోపించారు. గంధం శ్రీనివాసరావుతో పాటు టీడీపీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ సహా మరికొంతమంది కార్పొరేటర్లు ఈ వ్యవహారంపై అధికారులను నిలదీశారు. ఒకే అధికారి చాలాకాలంగా జీవీఎంసీలో పనిచేస్తూ రౌడీషీటర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇచ్చిన వివరణపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కమిషనర్ కేతన్ గార్గ్ జోక్యం చేసుకున్నారు. తాను బాధ్యతలు స్వీకరించాక పత్రికల్లో ఈ విషయమై అనేక కథనాలు చూశానని, తప్పిదాలు ఉన్నట్టు తెలుస్తోందని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మేయర్ వర్సెస్ గంధం
కోళ్ల వ్యర్థాల అంశంపై కార్పొరేటర్ గంధం శ్రీను మాట్లాడుతున్నప్పుడు మేయర్ పీలా శ్రీనివాసరావు అడ్డుకున్నారు. తాను ఒక అక్రమ వాహనాన్ని పట్టుకుని అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చానని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అనకాపల్లిలో ఒక వ్యక్తి తన వాహనాన్ని అడ్డుకుని, అక్కడి సిబ్బందితో తనపై ఆరోపణలు చేయించి, సోషల్ మీడియాలో పెట్టారని గంధం శ్రీను చెప్పారు. ‘సమయం వృథా అవుతోంది, మిగతా అంశాల్లోకి వెళ్దాం’ అని మేయర్ పీలా చెప్పగా, గంధం మండిపడ్డారు. దీనిపై చర్చ జరగాల్సిందేనని ఆయన పోడియం వైపు దూసుకుపోయారు. ‘కూర్చోకపోతే చర్యలు తీసుకుంటా’ అంటూ మేయర్ హెచ్చరించారు. ‘నువ్వు అధికార పార్టీ సభ్యుడివై ఉండి ఇలాగే మాట్లాడుతావా?’ అంటూ మేయర్ మండిపడ్డారు.
మేయర్ వైఫల్యం
సభను సజావుగా నిర్వహించడంలో మేయర్ పీలా శ్రీనివాసరావు విఫలమయ్యారు. ఒక అంశంపై చర్చ వచ్చినప్పుడు మేయర్ నుంచి ఆమోదం రాకపోతే ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టడం సాధారణం. ఆందోళన చేపట్టే సభ్యులతో మేయర్గా హుందాగా వ్యవహరించాల్సిన పీలా శ్రీనివాసరావు, ఆ హోదా గౌరవానికి భంగం కలిగించారు. సభ్యులను ఇష్టానుసారంగా మాట్లాడడం, సభలో సభ్యులు మేయర్కు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం చూస్తుంటే కౌన్సిల్ ఒక ఫంక్షన్లా మారిందనిపించింది. ఒక సభ్యుడు తన వార్డు సమస్యను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. గతంలో ఏ మేయర్ కూడా ఇంతగా దిగజారి సభను నడపలేదనే ఆరోపణలు కూటమి పార్టీ కార్పొరేటర్లు కూడా బహిరంగంగా చేశారు. చివరకు కమిషనర్ కేతన్ గార్గ్ జోక్యం చేసుకుని సభ్యులను వారి సీట్లలో కూర్చోమని చెప్పడం మేయర్ వైఫల్యానికి నిదర్శనం.
టీడీఆర్లపై గందరగోళం
టీడీఆర్ల జారీపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ పరిధిలో ఎన్ని మురికివాడలున్నాయి, రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో ఎంత మంది నష్టపోయారు, ఎంత మందికి టీడీఆర్లు జారీ చేశారు, అసలు నిబంధనలేంటి? ఉడా లేఅవుట్లకు కూడా జీవీఎంసీ అధికారులు ఎలా టీడీఆర్లు ఇచ్చేశారు? చివరకు శ్మశానానికి కూడా టీడీఆర్ ఇచ్చేశారంటే అధికారులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోందని పలువురు సభ్యులు విమర్శించారు. టీడీఆర్లకు సంబంధించి ఆన్లైన్లో 4200 దరఖాస్తులు నమోదైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి పలువురు సభ్యులు అధికారులపై మండిపడుతూ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బ్లాక్లిస్ట్లో ఉన్న సంస్థకు పనులా?
విజయవాడలో బ్లాక్లిస్ట్లో పెట్టిన ఒక సంస్థకు పనులు అప్పగించేలా ఒకేసారి రెండు సంవత్సరాలకు స్వీపింగ్ యంత్రాల మరమ్మతు పనుల అంచనాలను రూపొందించడంపై ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సంస్థకు పనులు అప్పగించేందుకు అనుకూలంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని విమర్శించారు. అయితే, ఎలాగైనా ఈ అంశాన్ని ఆమోదింపజేయాలని మేయర్ ప్రయత్నించారు. సభ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, తిరిగి ఒక ఏడాదికి అంచనాలు రూపొందించేందుకు కౌన్సిల్ నిర్ణయించింది.
వీటిపై అసలు చర్చేలేదు
టీడీఆర్ల జారీ, కోడి వ్యర్థాల సేకరణ, డంపింగ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, కేటాయింపులు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధిత అంశాలు, రెవెన్యూ షాపుల కాంట్రాక్ట్, జీ–20 పనులు, బహిరంగ టెండర్లు, పార్కులు, ఖాళీ స్థలాల ఆక్రమణలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ హక్కుల రక్షణ, పాత జైల్ రోడ్డులో రాత్రి పూట ఫుడ్ కోర్టు, ప్రత్యేక కమిటీల నియామకాలు, ప్రస్తుత ఆస్తి పన్ను రీసర్వే వంటి ముఖ్యమైన అంశాలున్నప్పటికీ, కేవలం మొదటి నాలుగు అంశాలు మాత్రమే చర్చించి మిగిలిన వాటిని వదిలేశారు.
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఆమోదం తెలపాలి
వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లూ శంకరరావుతో పాటు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బొడ్డు గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఆమోదం తెలపాలని పెద్ద ఎత్తున పట్టుబట్టారు. నల్ల దుస్తులు ధరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిరసన దాదాపు రెండు గంటల పాటు సాగింది. చివరకు మేయర్ దిగివచ్చి, మీరు లేఖ ఇవ్వండి, ప్రభుత్వానికి పంపుతానని చెప్పారు.

అడ్డంగా బుకై ్కన మేయర్

అడ్డంగా బుకై ్కన మేయర్