దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Aug 12 2025 7:58 AM | Updated on Aug 12 2025 12:52 PM

దూసుక

దూసుకొచ్చిన మృత్యువు

● విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ● మరొకరికి గాయాలు

డాబాగార్డెన్స్‌(విశాఖ):

కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాసన వేడుకతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఆ వేడుకను విజయవంతంగా ముగియగా.. సంతోషంగా తిరిగి ప్రయాణమవుతున్న ఆ ముత్యాలమ్మకు తెలియదు, అది తన జీవితానికి చివరి ప్రయాణమని. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వెంటాడి, కబళిస్తుందని... ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్‌లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాసన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చారు. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్‌కు చేరుకున్నారు. బొబ్బిలికి వెళ్లే తన చిన్న కుమార్తెను బస్సు ఎక్కించి, తాను ఎస్‌.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్‌ఫాం నంబర్‌ 25 వద్ద వేచి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లెవెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్‌ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుం డగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. సంతోషంగా ముగిసిన అన్నప్రాసన వేడుక, మరుసటి రోజే విషాదాన్ని మిగిల్చింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట (ఎస్‌.కోట)కు చెందిన గేదెల ముత్యాలమ్మ (47) తన గ్రామానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ద్వారకా బస్టాండ్‌కు చేరుకున్నారు. ఎస్‌.కోటకు వెళ్లే ప్లాట్‌ఫాం వద్ద ఆమె బస్సు కోసం వేచి ఉన్నారు. సుమారు 4.50 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లెవెలుగు బస్సు (హైర్‌ బస్సు) డ్రైవర్‌ చంద్రరావు బస్సును అతి వేగంగా ప్లాట్‌ఫాంపైకి పోనిచ్చాడు. ఈ క్రమంలో బస్సు కోసం వేచి ఉన్న ముత్యాలమ్మను తీవ్రంగా ఢీకొనడంతో ఆమె బస్సు, ప్లాట్‌ఫాం వద్ద ఉన్న స్తంభం మధ్య నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో

బస్సు ఢీకొని మహిళ మృతి

మరొకరికి గాయాలు

డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం

బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్‌ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.

దూసుకొచ్చిన మృత్యువు1
1/1

దూసుకొచ్చిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement