నేడు రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండో విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం వైదికులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల పచ్చి చందనంలో ఆదివారం పలు సుగంధ ద్రవ్యాలను కలిపారు. సోమవారం తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ అనంతరం చందనాన్ని సమర్పించనున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, వైదికులు చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి సమర్పణకు వీలుగా సిద్ధం చేశారు. ఆలయ ఏఈవో ఆనంద్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సింహాచలం క్షేత్రంలో సోమవారం వైశాఖ పౌర్ణమి ఉత్సవం కావడంతో ఆదివారం సాయంత్రానికే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు తరలివచ్చారు.


