
ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి
రావికమతం : ఆటో బోల్తా పడి ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన టి.అర్జాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తకోట పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలివి. టి.అర్జాపురం పంచాయతీ శివారు చిలకవానిపాలెం గ్రామానికి చెందిన యాదిగిరి కనకరాజు (31) ఆటో నడుపుతూ, తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు సంతానం తేజష్(4), దీక్షిత (11నెలలు) ఉన్నారు. శనివారం తెల్లవారుజామున కనకరాజు ఆటోలో అర్జాపురం నుంచి దొండపూడి అత్తగారి ఇంటికి వెళుతుండగా అర్జాపురం శాస్త్రిగారి తోట వద్ద కుక్క అడ్డుగా రావడంతో తిప్పించబోయి ఆటో బోల్తా పడింది. దీంతో గాయపడిన కనకరాజును స్థానికుల సహాయంతో హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై తండ్రి రాజుబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కనకరాజు అకాల మృతితో చిలకవానిపాలెం, దొండపూడి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.