దేవరాపల్లి: మండలంలోని బోయిలకింతాడ కాటా వద్ద చెరకు తరలింపు విషయంలో నెలకొన్న వివాదం రైతుల మధ్య తోపులాటకు దారి తీసింది. సీరియల్ను తప్పించి కాటా సిబ్బంది చెరకును తరలించడమే ఈ వివాదానికి కారణమైంది. చెరకు తరలింపులో గత రెండు రోజులుగా నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలతో కాటా వ్యవసాయ అధికారి కృష్ణమూర్తి బుధవారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, రైతులకు చెందిన చెరకు బళ్లను సీరియల్ను తప్పించి ఉద్దేశ పూర్వకంగా తరచూ పంపిస్తున్నారని కాటా సిబ్బందిని బుధవారం రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. ఇలా అడ్డదారుల్లో పంపిస్తే రోజుల తరబడి కాటా వద్ద నిరీక్షిస్తున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీరియల్ నంబర్లు పొందిన కొందరు రైతులు లేకపోవడంతో సీరియల్ నమోదు కాని రైతులకు చెందిన చెరకు తరలించామని టీడీపీ నాయకులు, సిబ్బంది సమాధానం చెప్పారు. ఇలా సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానంపై వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీరియల్ పొందిన రైతులు లేకపోతే ఆ తర్వాత సీరియల్ నెంబర్లు కల్గిన రైతులను పిలవాలి తప్పా, సీరియల్ నమోదు కాని రైతుల చెరకును ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన నాయకులు ఒక్కసారిగా బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు అరుపు, కేకలతో తోపులాటకు దిగారు. అక్కడున్న మిగిలిన రైతులు సముదాయించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇకపై ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకుంటామని కాటా ఏవో కృష్ణమూర్తి ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో శాంతించారు.