పాడేరు: స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో అర్జిదారులు ఇచ్చే వినతుల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం చూపవద్దని, నిర్లక్ష్యం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్థాయితో పాటు ప్రతి సోమవారం మండల స్థాయిల్లోనూ తప్పనిసరిగా పీజీఆర్ఎస్ నిర్వహించాలని, అధికారులందరూ సమగ్ర సమాచారంతో హాజరు కావాలని స్పష్టం చేశారు. అర్జిదారులు ’మీకోసం’ కాల్ సెంటర్ :1100 సేవలను సద్వీనియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీజీఆర్ఎస్లో 121, రెవెన్యూ క్లీనిక్లో 78 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులకు కలెక్టర్ నిశాంతి స్వయంగా భోజనం వడ్డించారు. ఇకపై ప్రతి శుక్రవారం అర్జీదారులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఇన్చార్జీ ఆర్డీవో భుజంగరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంతి


