● అరకు ఎంపీ తనూజరాణి
● చింతపల్లిలో కల్యాణ మండపం ప్రారంభం
● పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
కల్యాణ మండపం ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ బాలయ్యపడాల్ తదితరులు
మాట్లాడుతున్న ఎంపీ తనూజరాణి, వేదికపై మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి,ఎంపీపీ, జెడ్పీటీసీ అనూషదేవి, బాలయ్యపడాల్
చింతపల్లి: అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శాశ్వత ప్రజా ప్రయోజనాలకే అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. శుక్రవారం చింతపల్లిలోని స్థానిక డెయిరీ ఫారం ప్రాంగణంలో ఎంపీ అభివృద్ధి నిధులు రూ.40 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన నూతన కల్యాణ మండపాన్ని ఆమె పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పార్లమెంటు నిధుల నుంచి కేటాయించిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకులపై ఉందన్నారు. తాను ఎంపీగా విజయం సాధించిన వెంటనే చింతపల్లిలో కల్యాణ మండ లానికి నిధులు కేటాయించాలని స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, తాజా మాజీ సర్పంచ్లు అభ్యర్థించడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో కలిసి నిధుల మంజూరుకు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. చివరకు సాక్షాత్తు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ఈ కల్యాణ మండలానికి నిధులు మంజూరు చేసుకునేంత వరకు మొండి పట్టుదలతో వ్యవహరించిన స్థానిక నాయకులను ఆమె అభినందించారు. ఈ నిధులతో ఏర్పాటు చేసుకున్న మండపాన్ని ఇకపై శుభకార్యాలు, సమావేశాలకు ఉపయోగపడే విధంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కల్యాణ మండపం చుట్టూ ప్రహరీతోపాటు స్థానిక శ్మశాన వాటికలో షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ బాలయ్య పడాల్ విజ్ఞప్తి చేశారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ కల్యాణ మండపాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీకి అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు నిధుల విడుదలలో చింతపల్లికి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. గత ఎంపీ హయాంలో బోడకొండమ్మ ఆలయం, చెరువులవేనం వ్యూపాయింట్లకు అధిక నిధులు కేటాయించడం జరిగిందని గుర్తుచేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో బలిపం పంచాయతీ సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతోనే నేడు కోట్లాది రూపాయలతో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు ఎంపీపీలు కోరాబు అనూషదేవి, బోయిన కుమారి, బడుగు రమేష్, మండల పార్టీ అధ్యక్షులు పాంగి గణబాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బూసరి కృష్ణారావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాలం సీతయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఊర్మిల, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దురియా పుష్పలత, వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు, ఎస్ఎంఐ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకాష్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు వరప్రసాద్, చింతపల్లి, చౌడుపల్లి, లంబసింగి ఎంపీటీసిలు నాగలక్ష్మి, జయలక్ష్మి, మీనాకుమారి, నాగమణి, మాజీ సర్పంచ్లు కొర్రా రఘునాథ్, సింహాచలం, చిన్నబ్బాయి, బొజ్జన్నదొర, రమణమ్మ, రాజేశ్వరి, సోమరత్నం, రమేష్ నాయుడు, సీనియర్ నాయకులు నూకరాజు, దేపూరి గిరిబాబు, వలంటీర్లు యూనియన్ జిల్లా కార్యదర్శి పరమేశ్వరరావుతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


