● చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ ఆదిలక్ష్మి
పాడేరు: ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున రైతులు పంటల ప్రణాళికలో తగిన మార్పులు చేసుకోవాలని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టర్ డి.ఆదిలక్ష్మి సూచించారు. గురువారం స్థానిక ఏరువాక కేంద్రంలో ఎల్నినో పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. నేలలో తేమను కాపాడుకునేందుకు పొలాల్లో నీటి కుంటలు, తోటల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిసెల్ నాగలితో లోతుగా దున్నుకోవడంతో పాటు పంట వ్యర్థాలతో మల్చింగ్ చేయాలని సూచించారు. నీటి ఎద్దడిని తట్టుకునే కరువు నిరోధక వంగడాలను ఎంపిక చేసుకోవడం శ్రేయస్కరమన్నారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరికి బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేయడం శ్రేయస్కరమని తెలిపారు. వరి సాగు చేసేవారు ప్రత్యామ్నాయంగా ’తడిపి–ఎండబెట్టే’ పద్ధతిని పాటించి నీటిని ఆదా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి.ప్రదీప్కుమార్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.ఉమామహేశ్, స్పైసెస్ బోర్డ్ సెక్షన్ ఆఫీసర్ కళ్యాణి, రైతులు పాల్గొన్నారు.


