● అవమానకరంగా ఏపీఎఫ్డీసీఅధికారుల తీరు ● యూనిఫాంలో ఫోక్ సాంగ్స్కు డ్యాన్స్లు వేయడంపై విమర్శలు
సాక్షి,పాడేరు: గూడెంకొత్తవీధి మండలంలోని ఆర్వీ నగర్లో ఏపీఎఫ్డీసీ (ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ) అధికారుల బృందం 80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండా సాక్షిగా జానపద పాటలు (ఫోక్) నృత్యాలు చేయడం వివాదాస్పదమైంది. శనివారం ఆర్వీ నగర్ ఏపీఎఫ్డీసీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత దేశభక్తి గీతాలకు బదులుగా ’రాను నేను బొంబాయికి రాను’ అనే జానపద పాటకు అధికారులు, సిబ్బంది అందరూ కలిసి డ్యాన్సులు చేశారు. యూనిఫామ్ ధరించిన సిబ్బంది జాతీయ జెండాకు ఎదురుగానే అసభ్యకరరీతిలో నృత్యాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశభక్తిని చాటాల్సిన బాధ్యతాయుతమైన అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు ఇలాంటి పాటలకు డాన్సులు వేయడంపై స్థానిక గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించిన ఈ అధికార బృందంపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


