జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు (ఇన్సెట్) పాల్గొన్న
జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, అడిషనల్ ఏస్పీ శృతి, ఇతర అధికారులు
పాడేరు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో, ప్రతి కార్యాలయంలో, ప్రతి విద్యాసంస్థలో, వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడాలని జిల్లా కలెక్టర్ నిశాంతి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం పాడేరు పట్టణంలో ’‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్, అంబేడ్కర్ ద్కర్ సెంటర్ వరకు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు జాతీయ పతాకాలతో హర్ ఘర్ తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. పాత బస్టాండ్ వద్ద వారంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ దేశాభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదన్నారు. ప్రతి పౌరుడి భాగస్వామ్యం, సమష్ట్టి కృషి ఎంతో అవసరమన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పిలుపు నిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి పట్ల ప్రజల్లో స్ఫూర్తిని పెంపొందించేందుకు తిరంగ ర్యాలీ ఎంతో దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వై. శృతి, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.


