● ఫిన్లాండ్లో ఎఫ్ఎల్ఎన్ శిక్షణకు ఎంపిక ● పలువురి అభినందన
హుకుంపేట: మారుమూల ప్రాంతంలోని మత్స్యపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న మోస్య సత్యారావుకు అరుదైన అవకాశం దక్కింది. ఫిన్లాండ్లో జరిగే విద్యా శిక్షణ కార్యక్రమానికి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్లోని తుర్కు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమంలో సత్యారావు పాల్గొననున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల్లో 29 మందిని ఈ శిక్షణకు ఎంపిక చేయగా.. వారిలో సత్యారావు అవకాశం దక్కింది. గతేడాది సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సత్యారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపిక కావడంపై జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు, ఉప విద్యాశాఖ అధికారి సోమేలి చెల్లయ్య, స్థానిక ఎంఈవో ఈశ్వరరావు ఆయనను అభినందించారు.


