● జాయింట్ కలెక్టర్ అభినందన
పాడేరు రూరల్: నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (డెఫ్)లో తెలుగు క్రీడాకారులు ఘన విజయం సాధించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అన్నారు. విజయవాడలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన డెఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మూడో స్థానం సాధించిన క్రీడాకారిణి రాజాన గంగోత్రిని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల్లో మూడో స్థానం సాధించడం సాధారణ విషయం కాదన్నారు. గంగోత్రి భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలపై ఆసక్తితో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచే వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.


