చింతపల్లి: గిరిజన రైతాంగం పట్టుపరిశ్రమ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారి రవీంద్ర ప్రసాద్ సూచించారు. గురువారం మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో మల్బరి సాగు చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన రైతులు మల్బరి సాగు చేపట్టేందుకు అవసరమైన వివిధ పథకాలను ప్రభుత్వం 90 శాతం రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. రూ.45 వేల విలువైన నారు మొక్కలు, రూ.3.25 లక్షల విలువైన షెడ్ల నిర్మాణం, రూ.50 వేల విలువైన పరికరాలు, రూ.5 వేల విలువైన పట్టుపురుగులు, రోగనిరోధక మందులు, రూ.లక్ష విలువైన పవర్ టిల్లర్, వీడర్, బ్రష్ కట్టర్, స్ప్రేయర్, కత్తెరలు తదితరాలను 90 శాతం రాయితీపై గిరిజన రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో పట్టుగూళ్లకు కిలోకు రూ.400 నుంచి రూ.500 వరకు ధర లభిస్తోందని తెలిపారు. మంచి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన రైతులు మల్బరి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. ప్రతి రైతు మల్బరి సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర పట్టుపరిశ్రమల బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ నీలకంఠ రాజ్రుషి మల్బరి సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ తదితర అంశాలపై రైతు లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్వోలు సన్యాసిరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మేడూరులో రైతులతో మాట్లాడుతున్న జిల్లా పట్టుపరిశ్రమశాఖ అధికారి రవీంద్ర ప్రసాద్
మల్బరి సాగుపై సూచనలు ఇస్తున్న జిల్లా అధికారి రవీంద్ర ప్రసాద్, శాస్త్రవేత్త రాజ్రుషి


