● రైతులకు కలెక్టర్ నిశాంతి పిలుపు
సాక్షి, పాడేరు: జిల్లా లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీవోలు)లో సభ్యత్వం పొంది సామూహికంగా వ్యవసాయం, మా ర్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల ని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి రైతులకు పిలుపునిచ్చారు. సామూహిక వ్యవసాయాభివృద్ధి, మెరుగైన మార్కెటింగ్ అవకాశాలపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతులు తమ వ్యవసాయ, ఉద్యాన పంటలను సామూహికంగా విక్రయించేందుకు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ సదుపాయాలను వినియోగించుకునేందుకు ఎఫ్పీవోలు సమర్థవంతమైన వేదికలని పేర్కొన్నారు. జిల్లాలో కాఫీ, మిరియాలు, పసుపు, కూరగాయలు, అవకాడోతో పాటు ఇతర వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు తమ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎఫ్పీవోల్లో సభ్యులుగా చేరి ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రయోజనాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఇతర సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.


