డుంబ్రిగుడ: మండలంలోని చాపరాయి సమీపంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అరకు–పాడేరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, కార్లను ఆపి పత్రాలు, భద్రతా నిబంధనలను పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్. సురేష్ మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనలో భాగంగా పోలీసులు, ఈగల్ బృందం సంయుక్తంగా గిరిజన ప్రాంతాల్లో నిరంతరం కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా గంజాయి రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


