పాడేరు రూరల్: మండలంలోని మినుములూరు మోదకొండమ్మ తల్లి అమ్మవారి పాదాల ఆలయ ప్రాంగణం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతం కావడంతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసంతో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారి పాదాలను దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేకపూజలు
అమ్మవారి పాదాల వద్ద పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుని భక్తులు తమ కుటుంబ సభ్యుల క్షేమం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
కనీస వసతుల్లేక.. : నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ అక్కడ కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. తాగునీటి సదుపాయం, విశ్రాంతి తీసుకునేందుకు షె డ్లు లేదా సత్రాలు, మరుగుదొడ్లు, కూర్చునే ఏర్పాట్లు లేకపోవడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, ఎండాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలు కల్పించాలని వినతి
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే ఆలయానికి వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక దృష్టి సారించి తాగునీరు, షెడ్లు, పారిశుద్ధ్య సదుపాయాలు, మరుగుదొ డ్లు వంటి కనీస వసతులను ఏర్పాటు చేయాల ని భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.


