సీలేరు: ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీలేరు రిజర్వాయర్ అంటేనే విద్యుత్ వెలుగులకు, రుచికరమైన చేపలకు మారుపేరు. ఇక్కడి జలాశయాల్లో దొరికే చేపలకు స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, తాజాగా సీలేరు రిజర్వాయర్లో మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ టైగర్ రొయ్య వలకు చిక్కింది. వర్షాకాలం కావడంతో స్థానిక యువకులు తమ ఖాళీ సమయాల్లో రిజర్వాయర్ వద్ద చేపలు పట్టడం సహజం. ఇదే క్రమంలో, బుధవారం ఉదయం ఒక యువకుడి గేలానికి ఈ భారీ టైగర్ రొయ్య చిక్కింది. అంత పెద్ద సైజులో ఉన్న రొయ్యను చూసి సదరు యువకుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దానిని ఊరిలోకి తీసుకురాగా, స్థానికులు క్యూ కట్టి మరీ ఆ అరుదైన రొయ్యను తిలకించారు. సీలేరు రిజర్వాయర్ చరిత్రలో టైగర్ రొయ్య లభ్యం కావడం ఇదే మొదటిసారి కావడంతో, చాలామంది దానితో సెల్ఫీలు దిగి, సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్లలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.


