చలో ఢిల్లీ పోస్టర్లతో ఉపాధ్యాయులు
బుచ్చెయ్యపేట: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 10న తలపెట్టిన చలో ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాథ్ కోరారు. శుక్రవారం బుచ్చెయ్యపేటలో ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994 నుంచి 2010 సంవత్సరం వరకు నియమితులైన ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(టీఈటీ)ని మినహాయించాలని కోరారు. ఇందుకోసం ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం చలో ఢిల్లీ పోస్టర్లను ప్రదర్శించి ప్రచారం చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్. దుర్గాప్రసాద్, సంఘ నాయకులు కరుణాకర్, టి. రామకృష్ణ, జగన్ తదితరులు ఢిల్లీ తరలివెళ్లారు.


