మత విద్వేషాలు రగిల్చే రాజకీయాలు మానుకోవాలి
దేవరాపల్లి: ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకే చంద్రబాబు ప్రభుత్వం లడ్డూ వివాదాన్ని ముందుకు తెచ్చిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని, ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలపై సతమతమవుతుంటే అవేవీ పట్టించుకోకుండా, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లడ్డూ వివాదాన్ని వాడుకోవడం దారుణమన్నారు. లడ్డూలో జరిగిన కల్తీపై సిట్ నివేదికను అధికారికంగా వెల్లడించకుండానే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమకు తోచిన విధంగా దుష్ప్రచారం చేస్తూ వాస్తవాలను సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై కూటమి నాయకులు తలో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్రం నియమించిన సిట్ టీటీడీకి చెందిన ముగ్గురు అధికారులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తే కూటమి ప్రభుత్వం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డారని సిట్ నివేదిక చెప్పినా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను బహిర్గతం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం మరో విచారణ కమిటీ వేయడం చూస్తే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోందన్నారు.
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న


