మత్స్యగెడ్డలో పడి వ్యక్తి మృతి
అరడకోటలో విషాదం
పెదబయలు: మండలంలోని అరడకోట గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి తమర్భ వెంకటరమణ (35) అనే వ్యక్తి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో వెంకటరమణ బహిర్భూమి కోసం మత్స్యగెడ్డ ఒడ్డుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి గెడ్డలో పడిపోవడంతో, నీటి అడుగున ఉన్న ఊబిలో చిక్కుకొని మృతి చెందాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆయన్ని కాపాడే అవకాశం లేకుండా పోయింది. ఒడిశాకు వెళ్లే బోటు రేవు (వెలంబొడ్డ) సమీపంలో కొన్ని గంటల తర్వాత మృతదేహాన్ని గమనించిన స్థానికులు అరడకోట గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్, మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కుటుంబంలో తీరని లోటు..
మృతుడు వెంకటరమణ ప్రైవేటు జీపు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. ఉదయాన్నే నిద్రలేచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మనిషి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనతో అరడకోట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మత్స్యగెడ్డలో పడి వ్యక్తి మృతి


