భగవంతుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని అన్నారు. తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేల్చిన తర్వాత కూడా కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలంలో దర్శనం కోసం వచ్చిన శివభక్తులపై లాఠీ చార్జీ చేయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే దేవుడు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. నీచ ప్రచారాలు, అబద్ధాలను కట్టిపెట్టి భక్తుల మనోభావాలను టీడీపీ నాయకులు గౌరవించాలన్నారు.


